Home తెలంగాణ ఫిరాయింపులపై కేటీఆర్ కు మాట్లాడే అర్హత ఉందా..?

ఫిరాయింపులపై కేటీఆర్ కు మాట్లాడే అర్హత ఉందా..?

టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్

by live
0 comment

ఫిరాయింపులను ప్రోత్సహించి, రాజకీయ వ్యవస్థని భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్ నాయకులు.. ఇప్పుడు నీతులు మాట్లాడడం సిగ్గుచేటని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాష్కి గౌడ్ గారు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలపై కేటీఆర్, హరీష్ రావులు కాంగ్రెస్ పై చేసిన విమర్శలపై మధుయాష్కి గౌడ్ తీవ్రంగా స్పందించారు.

మంగళవారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. అధికారం చేతిలో ఉందన్న అహంకారంతో ప్రతిపక్ష పార్టీలను చీల్చి, రాజకీయాల్లో విలువలను దిగజార్చిన ఘన చరిత్ర కెసిఆర్ కుటుంబానిదన్నారు. అలాంటి వారు ఈరోజు ఫిరాయింపులపై మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు ఫిరాయింపులు గుర్తు రాలేదా కేటీఆర్..? అని ప్రశ్నించారు.

2018లో బీఆర్ఎస్ పార్టీకి 88 మంది ఎమ్మెల్యేలు, దాని మిత్రపక్షం ఎంఐఎం కు 7 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ఎవరి గడ్డి కరవడానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని ప్రశ్నించారు.

కాంగ్రెస్ నుంచి 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవగా.. ఒక్కొక్కరిగా 12 మందిని టిఆర్ఎస్ లో చేర్చుకొని కండువాలు కప్పిన విషయాన్ని ఎవరు మర్చిపోరు అన్నారు. 2019లో ఉత్తంకుమార్ రెడ్డి గారు ఎంపీగా గెలుపొంది ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన తరువాత .. కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 18 కి పడిపోగా.. 2/3 మెజార్టీ వచ్చిందని భావించి, అప్పుడు 12 మంది ఎమ్మెల్యేలతో విలీన ప్రక్రియ కోసం లెటర్ ఇచ్చారని గుర్తు చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పది రోజుల నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని, కూలిపోతుందని ఒకవైపు బీఆర్ఎస్ నేతలు కెసిఆర్ కేటీఆర్..మరోవైపు బిజెపి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తమ మాటలతో బీరాలు పలికి రెచ్చగొట్టిన సంగతి మర్చిపోయారా? అని ప్రశ్నించారు. కెసిఆర్ ని త్వరలో ముఖ్యమంత్రిని కూడా చేసుకుందామంటూ జనవరి 25న కరీంనగర్ సభలో కేటీఆర్ వ్యాఖ్యలు.. వారి బెదిరింపు మాటలకు నిదర్శనం అన్నారు. మీ బెదిరింపు మాటలతోటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తలుపులు తెరిచి పార్టీలోకి వచ్చే వారందరినీ ఆహ్వానించాల్సి వస్తుందన్నారు.

ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరుగా తమ పార్టీలోకి వస్తున్నారని, త్వరలో 2/3 మెజార్టీ మార్క్ దాటడం ఖాయమని పేర్కొన్నారు.

దేశం మొత్తంలోనే రాజకీయాల్లో విలువలను నీచంగా దిగదార్చిన వ్యక్తి కెసిఆర్ అని మండిపడ్డారు. పదేళ్ల తన రాజరిక పాలనలో డబ్బు సంస్కృతిని విపరీతంగా పెంచి పోషించారన్నారు.

దోచుకున్న అవినీతి సొమ్ము తో మళ్లీ అధికారంలోకి వస్తామన్న అహంకారంతో ఎన్నికల్లో పోటీ చేసి.. ప్రజలిచ్చిన తీర్పుతో బొక్క బోర్ల పడ్డాడని ఆరోపించారు.

తెలంగాణ ఉద్యమ పార్టీ అని చెప్పి, తెలంగాణకు కాపలా కుక్కలమని చెప్పి.. పదేళ్లపాటు ప్రజలను మభ్యపెట్టి దోచుకున్నారని, ఏనాడైతే వారి పార్టీ నుంచి తెలంగాణ పదం తీసేశారో ఆనాటి నుంచే బిఆర్ఎస్ పతనం మొదలైంది అన్నారు. ఇక ఆ పార్టీ తెలంగాణలో భూస్థాపితం కావడం ఖాయం అన్నారు.

You may also like

Leave a Comment

google-site-verification=-B5SA7J39MJJUCL_p49riXcIyaQATDXtGvxIktmRKi4